వైఎస్ వివేకానంద హత్యకేసులో గురువారం కీలక విచారణ జరుగుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రానికి విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన సిట్ ముందు హాజరయ్యారు.
ఈ ఏడాది మార్చి 15న పులివెందులలో వివేక హత్య జరిగితే.. 8 నెలల తర్వాత ఆదినారాయణరెడ్డిని పిలవడం విశేషం. హత్య జరిగిన రోజే కొందరు వైసీపీ నేతలు.. ఆదినారాయణ రెడ్డిపై ఆరోపణలు చేశారు. పదిరోజుల నుంచి కడపలో జరుగుతున్న సిట్ విచారణలో పలువురు కీలక నేతలను విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఆదినారాయణరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 5న ఆదినారాయణ రెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిని సైతం సిట్ అధికారులు విచారించారు.
ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.. తప్పుందని తేలితే బహిరంగంగా ఉరి వేసుకుంటానన్నారు. వివేకా కేసు విచారణ సిట్కు చేతకాకపోతే.. సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.