ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై భగ్గుమంటున్నారు రాజధాని రైతులు. ఈ ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. దీనికి టీడీపీ మద్దతు తెలిపింది. మూడు రాజదానుల ప్రకటన వెనుకు దాదాగిరి రాజకీయాలో వైసీపీ అజెండా ఉందంటూ విమర్శించారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేయాలన్నదే జగన్ లక్ష్యమన్నారు.
అటు టీడీపీ నేతల్ని విమర్శల్ని తిప్పికొట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధానిపై GNరావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఈనెల 27న జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చిస్తామన్నారాయన. విశాఖలో భూములకు సంబంధించి ఆధారాలు ఉంటే బయటపెట్టాలని టీడీపీకి సవాల్ విసిరారు మంత్రి బొత్ససత్యనారాయణ..
రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చామన్నారు హోం మంత్రి మేకతోటి సుచరిత. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే మంచి ఉద్దేశంతోనే సీఎం జగన్ ఈనిర్ణయం తీసుకున్నారన్నారు.
మరోవైపు .. అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేసారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రాజధానికి వెళ్తుంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్లుందన్నారు. రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలని.. కానీ అమరావతిలో అది కనిపించలేదన్నారు.
మొత్తానికి రాజధానిపై అధికార, ప్రతిపక్ష నేతలు ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రజల్లోకి వెళ్తుంటే..అటు ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామని చెబుతోంది.