అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావంగా విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు నిరసన దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షకు పార్టీలకతీతంగా అంతా మద్దతు తెలుతుపుతున్నారు. గద్దె రామ్మోహన్రావు చేపడుతున్న దీక్షకు సీపీఐ నేత నారాయణ సంఘీభావం ప్రకటించారు. రాజధాని మార్చాలంటే జగన్ ప్రభుత్వం మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని నారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రాజధాని మార్పుపై ఎందుకు జగన్ ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. మూడు ముక్కలు చేస్తే అభివృద్ధి జరగదని అన్నారు. అసెంబ్లీ, పరిపాలన వ్యవస్థ దంపతుల సంబంధం లాంటిదన్నారు. రాజధాని విశాఖ తరలింపుతో ఇంకా ఎక్కువ ఖర్చవుతుందన్నారు. స్పీకర్ తమ్మినేని వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంటే బాగుండేదని నారాయణ ఎద్దేవా చేశారు.