తీవ్ర ఉద్రిక్తతల నడుమ పవన్ కళ్యాణ్ కాకినాడ టూర్

Update: 2020-01-14 11:08 GMT

తీవ్ర ఉద్రిక్తతల నడుమ పవన్ కళ్యాణ్ కాకినాడ టూర్ కొనసాగుతోంది. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకున్న ఆయన స్థానిక జనసేన నేత పంతం నానాజీ ఇంటికి వెళ్లారు. అక్కడ గాయపడిన నేతలు, కార్యకర్తలను పరామర్శించారు. ఆ తర్వాత.. జనసేన నేతల సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు పవన్.

పవన్ టూర్‌లో కాకినాడలో 144 సెక్షన్, పోలీస్‌ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. నగరంలో దాదాపు 8వందల మంది పోలీసుల్ని మోహరించారు. ప్రధాన రోడ్లను మూసివేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు, పికెటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో నగరంలో కర్ఫ్యూవాతావరణం కనిపిస్తోంది. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పండగరోజు ఈ కర్ఫ్యూ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా గత శనివారం వైసీపీ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి.. పవన్‌ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని నిరసించిన జనసైనికులు.. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఈ సమయంలో భానుగుడి సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జనసైనికులపై వైసీపీ నేతలు దాడి చేశారు. దొరికినవాళ్లను దొరికినట్టుగా చితగ్గొట్టారు. అసభ్య పదాలతో దూషణకు దిగారు. దీంతో ఆరోజంతా కాకినాడ రణరంగమైంది.

జనసైనికులపై వైసీపీ దాడిని ఆ పార్టీ అధినేత పవన్ సీరియస్‌గా తీసుకున్నారు. ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడ చేరుకున్నారు. జనసైనికుల్ని పరామర్శించి.. భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు పవన్ కళ్యాణ్‌. కాకినాడలో హై టెన్షన్ నెలకొనడంతో.. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Similar News