టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఘన నివాళి
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు 24వ వర్ధంతి నేడు. ఆయన వర్ధంతి పురస్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్లో ఈసారి టీటీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ ఘాట్లోని సమాధికి మరమ్మతులతో పాటు పుష్పాలంకరణ చేశారు. సనత్నగర్ నియోజకవర్గం నాయకులు శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో రసూల్పూర చౌరస్తా ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరవుతారని చెప్పారు.
ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేయకపోవడం శోచనీయమన్నారు పలువురు నేతలు. ఈ నేపథ్యంలో టీటీడీపీ ఎన్టీఆర్ ఘాట్లో స్వయంగా ఏర్పాట్లు చేసింది. సమాధి పెచ్చులూడుతుండటంతో పాటు పుష్పాలంకరణపై హెచ్ఎండీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దీంతో సమాధి అలంకరణ పనులు పార్టీ పరంగా చేపట్టాలని టీటీడీపీ నిర్ణయించింది.
మరోవైపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు. తాతగారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అటు.. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి హైదరాబాద్లో నివాళి అర్పించారు. కుటుంబ సమేతంగా ఎన్టీఆర్ ఘాట్కు వచ్చారామె. తన తండ్రికి పుష్పాంజలి ఘటించారు.