ఏపీ శాసనమండలిలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అంశంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మండలి ఛైర్మన్ ఛాంబర్కు రెండు పక్షాల సభ్యులు క్యూ కడుతున్నారు. తమ వాదనలను ఛైర్మన్కు వివరిస్తున్నారు. అయితే, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ప్రొసీడింగ్స్ ప్రారంభించకముందే సెలెక్ట్ కమిటీకి చెందిన నోటీసులివ్వాలంటున్నారు. ఏ రూల్ ప్రకారం చూసినా ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశం లేదంటున్నారు. మరోవైపు ప్రతిపక్షం ఈ వాదనను వ్యతిరేకిస్తోంది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందేనని పట్టుబడుతున్నారు.