ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులపై దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న కేసులపై రాజ్యసభ లో చర్చ జరిగింది. ఈ అంశంపై ఎంపీ కనకమేడల మాట్లాడారు. సీఎం జగన్పై 11 అవినీతి కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. కోర్టుకు హాజరుకాలేనని ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారని తెలిపారు. ఐతే, సీఎం జగన్ పేరును ప్రస్తావించడంపై వైసీపీ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. కనకమేడల ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ ఎంపీల తీరుపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ప్రసంగాన్ని కొనసాగించిన కనకమేడల, ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.