జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే ఆర్టికల్ 370 ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్లో నివాసితుల ఉద్యోగ అర్హతకు సంబంధించి సరికొత్త నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీచేసింది. దీని ప్రకారం కాశ్మీర్లో 15 సంవత్సరాల పాటు నివసించినా లేదా ఏడు సంవత్సరాల పాటు విద్యను అభ్యసించినా లేదంటే ఈ ప్రాంతంలో ఉన్న విద్యాసంస్థలలో 10/12 తరగతి పరీక్షలకు హాజరైన వారు గాని ఇప్పటినుంచి శాశ్వత నివాసితులు కావడానికి అర్హులు అవుతారు.
దీంతో ఈ చట్టం ప్రకారం గ్రేడ్-4 వరకు ఉన్న ఉద్యోగాలు జమ్ముకాశ్మీర్ స్థిరనివాసితులకే వర్తిస్తాయి. ఈ చట్టం ప్రకారం కాశ్మీర్లో మొత్తం 10 సంవత్సరాల పాటు సేవలందించిన కేంద్ర ప్రభుత్వ అధికారుల పిల్లలకు నివాస హోదాను కల్పించింది. మరోవైపు ఈ చట్టంపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దల్లా మండిపడ్డారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్డౌన్లో ఉన్న సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్లయాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.