బయట ఫుడ్డు తినొద్దురా బాబూ అన్నా మనకి అదే నచ్చుతుంది కదా అని ఆన్లైన్లో ఆర్డర్ చేయడం.. నిమిషాల్లో డెలివరీ బాయ్ పార్సిల్ తీసుకొచ్చి చేతిలో పెట్టడం జరిగేది. ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో కూడా కొన్ని ఫుడ్ కోర్టులు పని చేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కరోనా కాలంలో ఆందోళన కలిగించే అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఓ పిజ్జా డెలివరీ బాయ్కి కరోనా వచ్చి ఆసుపత్రిలో జాయినయ్యాడు. గత 15 రోజుల్లో అతడు డెలివరీ చేసిన 72 ప్రదేశాలను గుర్తించి వారందరినీ గృహనిర్భంధం చేశారు అధికారులు. ఇంకా అతడితో పాటు పని చేసిన 17 మందిని కూడా నిర్భంధంలో ఉంచారు. డెలివరీ బాయ్కి దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుంటే కరోనా టెస్టులు చేశారు. పాజిటివ్ రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
డెలివరీ బాయ్ ఆహారాన్ని అందించిన సమయంలో ఎవరికైనా ఈ వైరస్ వుండి వుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఢిల్లీలో ఇప్పటి వరకు 1,578 మందికి కరోనా పాజిటివ్ కేసులు బయటపడగా, 30 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఈ సంఘటన వెలుగు చూడడంతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే నగర జీవులు కొంత వెనుకడుగు వేస్తున్నారు.