తెలంగాణలో 4వేలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

Update: 2020-06-09 23:31 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4వేలకు చేరువలో ఉంది.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 178 కేసులు నిర్ధారణ అయ్యాయి.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3920కి చేరింది. తాజాగా తెలంగాణలో కరోనాతో ఆరుగురు మరణించారు.. మొత్తం మరణాల సంఖ్య 148కి చేరింది.. ఇప్పటి వరకు 1742 మందిని డిశ్చార్జ్‌ చేయగా, 2030 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎక్కువ భాగం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 143 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్‌ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.. మహబూబ్‌నగర్‌లో రెండు, సంగారెడ్డిలో రెండు, మెదక్‌లో రెండు కేసులు నమోదు కాగా.. జగిత్యాల, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

లాక్‌‌డౌన్‌ సడలింపుల తర్వాత కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. గత నెల 16 నుంచి లాక్‌ డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం కొద్దికొద్దిగా సడలిస్తూ వచ్చింది.. ఈ నేపథ్యంలో జనం బయట తిరిగేందుకు వెసులుబాటు లభించింది.. అటు వలస కార్మికులతోపాటు అంతర్‌ జిల్లాల బస్సు సర్వీసులు కూడా పెరగడంతో జిల్లాల్లో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.. గతంలో ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మాస్కులు లేకుండా బయటకు రావద్దని హెచ్చరిస్తున్నా జనం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కరోనా బారిన పడకుండా కేంద్రం సూచించిన నిబంధనలను పాటించకపోవడం వల్లే వైరస్‌ వ్యాప్తి జరుగుతున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

Similar News