అనంతపురంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ లో జరిగిన వివాదం ఒక యువతి ప్రాణాలను బలిగొంది. తమ సహోద్యోగితో ఉన్న ప్రేమ వ్యవహారం బయటపడటంతో.. అదే వ్యక్తి తో ప్రేమలో ఉన్న మరో యువతి నుంచి వచ్చిన బెదిరింపులకు భయపడి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం... సాయినగర్లోని దీపు బ్లడ్ బ్యాంకులో అరుణ్కుమార్, ప్రతిభ భారతి , స్వాతి లు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. గత రెండేళ్లుగా అరుణ్కుమార్, ప్రతిభా భారతి ప్రేమలో ఉన్నారు. వీరితోపాటే పనిచేస్తున్న పెనుకొండ మండలం గొందిపల్లికి చెందిన స్వాతితో కూడా అరుణ్కుమార్కు పరిచయం ఏర్పడింది. అయితే, ఈ ముగ్గురిలో, అరుణ్ మొదటి ప్రియురాలికి తెలియకుండానే స్వాతితో రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపాడు.
కొంతకాలానికి అరుణ్, స్వాతిల ప్రేమ వ్యవహారం ప్రతిభాభారతికి తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె నిన్న ఉదయం స్వాతికి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో మందలించింది. "అన్నావదిన అంటూ నా ప్రియుడితోనే ప్రేమ నడుపుతావా? మీ ఇద్దరి విషయం నాకు తెలిసిపోయింది. ఈరోజు ల్యాబ్కు రా, నీ సంగతి తేలుస్తా" అంటూ బెదిరించింది. ఈ ఫోన్ కాల్తో స్వాతి తీవ్ర భయాందోళనలకు గురైంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన స్వాతి తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా..అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.