ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ సంఘం సెక్రెటరీ సుల్తాన్ మూసావి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ సంఘం సెక్రెటరీ, భారత టీటీ సమాఖ్య ఉపాధ్యక్షుడు ఎస్.ఎమ్.సుల్తాన్ మూసావి కన్నుమూశారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ ఆయన.. విజయవాడలో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన సతీమణి కూడా నిన్ననే కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గతవారమే ఆయన తల్లి కరోనాతో మృతి చెందారు. వారం రోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు కరోనాతో కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా టేబుల్ టెన్నిస్ క్రీడాభివృద్ధిలో... సుల్తాన్ కీలక పాత్ర పోషించారు. ఆయన అకాలమరణంతో క్రీడాలోకంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సుల్తాన్ లేని లోటు పూడ్చలేనిదని... ఆయన ప్రోత్సాహంతో ఎందరో క్రీడాకారులు ముందడుగు వేశారని... క్రీడా ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు.