AP: ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కలకలం
నిందితులను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం, మొలకలచెరువులో పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు, స్థానిక పోలీసులు ఈ కుటీర పరిశ్రమను సీజ్ చేశారు. ఈ డంపులో రూ. కోటికి పైగా విలువైన నకిలీ మద్యం, తయారీకి ఉపయోగపడే యంత్రాలు, ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ కార్యకలాపాల్లో పాల్పడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన జనార్దన్రావు, అతని అనుచరుడు రాజు కలిసి ములకలచెరువు కనుగొండ ఆర్చి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. పలు ప్రభుత్వ మద్యం దుకాణాలు సహా.. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ధర కంటే తక్కువకే ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 15 వేల నకిలీ మద్యం సీసాలు, 1,050 లీటర్ల స్పిరిట్ క్యాన్లు, 1,500 లీటర్ల బ్లెండ్ , 10 వేల ఖాళీ మద్యం బాటిళ్లు, మూతలు, స్టిక్కర్లు, తయారీ పరికరాలు, ఇతర సామగ్రితోపాటు సరఫరాకు వినియోగిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.
లిక్కర్ "డైరీ" కలకలం?
నకిలీ మద్యం తయారీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది. నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడుల సమయంలో ఎక్సైజ్ అధికారుల చేతికి డైరీ దొరికింది. డైరీలో నకిలీ మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. డైరీలో 78 మంది పేర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు.
మద్యం అక్రమాలకు నిదర్శనం: జగన్
మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన చంద్రబాబు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టిడిపి నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకాని, లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, అక్రమ సంపాదనను పైనుంచి కిందివరకూ వీరంతా పంచుకుంటున్నారని విమర్శించారు.