BLAST: ఢిల్లీలో పేలుడు.. తెలుగు రాష్ట్రాల్లో హై అలెర్ట్
పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
దేశ రాజధాని నడిబొడ్డున... ఎర్రకోట సమీపంలో.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి అనేక వాహనాలు బుగ్గిఅయ్యాయి.13 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పేలుడుపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయిలో సమీక్షించారు.
తెలుగు రాష్ట్రాల్లో హై అలెర్ట్
ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లోని రైల్వేస్టేషన్స్, బస్టాండ్స్ లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్.. శంషాబాద్ ఎయిర్ పోర్డులో తనిఖీలు జరుగుతున్నాయి. MGBS, JBS, పలు బిస్టాండ్స్ రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు.. అనుమానం వచ్చిన వాళ్లను అస్సలు వదలడం లేదు. ఈ క్రమంలో రద్దీ ప్రాంతాల్లో వాహానాల తనిఖీలు, నాకాబందీ చేపట్టాలని సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు యావత్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. హైదరాబాద్లో సైతం పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఏపీలోనూ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భారత దేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఎదుగుతున్న ఈ సమయంలో, ఇలాంటి పిరికి చర్యలు మన ఏకత్వాన్ని దెబ్బతీయలేవని.. ఈ చర్యలు వారికి నిరాశను మాత్రమే చూపిస్తాయన్నారు. ఘటనకు పాల్పడిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని కోరారు.