Chandrababu: అమరావతిపై జగన్ ఎందుకు ఆ ముద్రవేస్తున్నారు: చంద్రబాబు
Chandrababu: మడమతిప్పనన్న జగన్.. అమరావతిపై ఎందుకు మాట తప్పారని, ఎందుకు ఒకే సామాజిక వర్గ ముద్రవేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
Chandrababu: మడమతిప్పనన్న జగన్.. అమరావతిపై ఎందుకు మాట తప్పారని, ఎందుకు ఒకే సామాజిక వర్గ ముద్రవేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతే రాజధాని అంటూ ఎన్నికల ముందూ, అసెంబ్లీలోనూ చెప్పిన జగన్ మూడుముక్కలాడుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన మహోద్యమసభకు చంద్రబాబు హాజరై సంఘీభావం తెలిపారు.
అమరావతి ఉద్యమం మొదలైనప్పటి నుంచి వేలాది కేసులు పెట్టారన్నారు. అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని, వారి త్యాగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తునన్నారు. జగన్ ఇష్టానుసారం చేస్తానంటే కుదరదని.. అమరావతి ఏ ఒక్కరిదో కాదని.. ప్రజలు కోరుకున్న ప్రజా రాజధాని అని చంద్రబాబు స్పష్టం చేశారు.
అమరావతిపై జగన్ ఎన్నో దుష్రచారాలు చేశారన్నారు చంద్రబాబు. అమరావతి మునిగి పోతుందని.. అమరావతిలో భూమి గట్టిది కాదని...ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అపోహలు సృష్టించారు. ఈ మూడేళ్లలో అమరావతి ఎప్పుడైనా మునిగిందా అని ప్రశ్నించారు. జగన్ కూర్చుంటున్న సెక్రటేరియట్, అసెంబ్లీ, ఆఖరికి హైకోర్టు కూడా అమరావతి రైతుల భూముల్లోనే ఉన్నాయన్నారు.
రాజధానికి నిధులు లేవని జగన్ అంటున్నారని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అమరావతిని అభివృద్ధి చేయొచ్చని చంద్రబాబు చెప్పారు. జగన్ చెడగొట్టకుండా ఉంటే చాలు ఆయన ఇంట్లోకూర్చున్నా.. అమరావతి దానికదే అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో కావాలి.. రాజధాని మాత్రం అమరావతిలో ఉండాలని నొక్కి చెప్పారు.