ఏపీలో ఉచిత ఇసుక విధానం ఇవాళ అమల్లోకి వచ్చింది. అయితే నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను రేటు రూ.1,225, విశాఖ అగనంపూడి వద్ద ధర రూ.1,394 అని ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేటా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉన్నందున ఈ రేటు ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఉచిత ఇసుకపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్గా జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందులో SP, JC, వివిధ శాఖల అధికారులు ఉంటారు. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీల బాధ్యతను జిల్లా కమిటీలే పర్యవేక్షిస్తాయి. ఇసుకను తిరిగి అమ్మినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఉచిత ఇసుకను భవన నిర్మాణాలకు మాత్రమే వాడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైసీపీ ప్రభుత్వంలోని 2019, 2021 ఇసుక విధానాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.