అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు ఆగడం లేదు. గత మూడ్రోజులుగా వరసుగా దాడులు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని, జేసీకి మద్దతుగా ఫ్లెక్సీ కట్టాడంటూ టీడీపీ కార్యకర్త సాయి శ్రీకాంత్ను చితకబాదారు వైసీపీ మద్దతుదారులు. క్రికెట్ బ్యాట్లు, ఇనుప రాడ్లు, వికెట్లతో చావబాదారు. మరోసారి పోస్టులు పెడితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. వైసీపీ కార్యకర్తల దాడుల్లో తీవ్రంగా గాయపడిన సాయి శ్రీకాంత్ను.. తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు టీడీపీ కార్యకర్తలు. ఓ వైపు తాడిపత్రిలో శాంతిభద్రతలు కాపాడాలంటూ.. పోలీసులు కవాతులు చేస్తుంటే.. అటు వైసీపీ నేతలు మాత్రం రెచ్చిపోతుండటంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తాడిపత్రిలో టీడీపీ నేతలపై జరుగుతున్న వరుస దాడులపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. శాంతిభద్రతలు కాపాడటంలో జగన్ సర్కారు తీవ్రంగా విఫలమైందంటూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన తమ కార్యకర్తల్ని ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. వైసీపీ దాడుల్లో గాయపడిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణ, రాంబాబు, వేణుగోపాల్, అమీర్ వలీలను పరామర్శించారు కాలువ శ్రీనివాసులు. వరుస దాడుల్ని అరికట్టడంలో విఫలమైన స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారు.