Kuppam: కుప్పంలో వైసీపీదే విజయం.. గట్టి పోటీ ఇచ్చిన టీడీపీ..
Kuppam: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అంతా ఊహించినట్లే జరిగింది. ఎప్పటిలాగా అధికార బలంతో వైసీపీ మరోసారి విజయం సాధించింది.;
Kuppam (tv5news.in)
Kuppam: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అంతా ఊహించినట్లే జరిగింది. ఎప్పటిలాగా అధికార బలంతో వైసీపీ మరోసారి విజయం సాధించింది. దాడులు, దొంగ ఓట్లు, దౌర్జన్యాలు, దారుణాలు అధికార పార్టీ నేతల అరాచకాలు ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపించాయి. ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికల్ని వైసీపీ నేతలు నవ్వులపాలు చేశారు.
దీంతో వారు అనుకున్నట్లే ఫలితాలు వచ్చాయి. మొత్తం 25 వార్డులు ఉండగా..14 వ వార్డు విదాస్పద రీతిలో ఏకగ్రీవం చేసుకుంది వైసీపీ. మిగిలిన 24 వార్డులకు ఎన్నికలు జరిగా ఇందులో 18 వార్డులు వైసీపీ గెలుచుకుంది. ఆరు వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంలో.. ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఒక్కరంటే ఒక్కరు కూడా పోస్ట్ బ్యాలెట్ వినియోగించుకోలేదు.
దీంతో నేరుగా ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాలతో.. కౌంటింగ్ కొనసాగింది. 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్... 11 గంటలయ్యే సరికా దాదాపు విజయం ఎవరిదన్నది తేలిపోయింది. తొలి రౌండ్లో 14 వార్డుల్లో కౌంటింగ్ చేయగా.. 5, 11 వార్డుల్లో టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇక ప్రతివార్డులోనూ వైసీపీకి ధీటుగా నిలిచింది టీడీపీ.
11వ వార్డులో టీడీపీ అభ్యర్ధి కస్తూరి 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే..ఇక్కడ రీకౌంటింగ్ జరపాల్సిందేనని పట్టుబట్టింది వైసీపీ. దీంతో రీకౌంటింగ్ చేయగా.. రెండోసారి కూడా టీడీపీ అభ్యర్ధి కస్తూరి గెలుపొందినట్లు ప్రకటించారు. కౌంటింగ్ సెంటర్లో తనను వైసీపీ నేతలు బెదిరించారన్నారు టీడీపీ అభ్యర్ధి కస్తూరి. చంద్రబాబు చేసిన అభివృద్ధే తనను గెలిపించిందని తెలిపారామె.
వైసీపీ నేతల డబ్బుకు ఓటర్లు లొంగలేదన్నారు కస్తూరి.ఇక.. రెండో రౌండ్లోనూ సేమ్ సీన్ రీపీటయింది. 16 నుంచి 25 వార్డుల్లో కౌంటింగ్ జరగా.. నాలుగు వార్డుల్లో టీడీపీ గెలిచింది. 18, 19, 20, 22 వార్డుల్లో టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. 19 వార్డు టీడీపీ అభ్యర్ధి దామోదరం 97ఓట్లతో గెలిచారు. 20వ వార్డులో టీడీపీ అభ్యర్ధి సోమశేఖర్ 152 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా.. 22 వార్డు టీడీపీ అభ్యర్ధి సురేష్కుమార్... 232 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
నియోజకవర్గంలోని కీలక నేతలుగా ఉన్న కొందరు పోటీ చేయగా.. వారు కూడా ఘోరంగా ఓడిపోయారు. మిగిలిన 6 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు.. పోలింగ్ ముందురోజు వరకు వైసీపీ పెద్దలు, మంత్రులు నియోజకవర్గంలో మకాం వేసి అధికారం, డబ్బు, దొంగ ఓట్లుతో కుప్పంలో అధికార పార్టీని గెలిపించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మొదట్నుంచి వైసీపీ అరాచకాలను టీడీపీ అధినేత చంద్రబాబు. స్థానిక టీడీపీ నేతలు.. పోలీసులకు, ఈసీకి ఫిర్యాదు చేసినా ప్రయోజం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో ఏ మాత్రం బలం లేకున్నా కేవలం అధికార పార్టీ కావడం వల్లే అన్ని అనుకూలతలను వైసీపీ వినియోగించుకుందని మొదట్నుంచి టీడీపీ ఆరోపణలు చేస్తునే ఉంది. అన్నట్లుగానే చివరికి వైసీపీ గెలిచింది.