నెల్లూరు జిల్లా పాదయాత్రలో నారా లోకేష్ సంచనల ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసు ఎఫ్ఐఆర్లో భారతి పేరును సీబీఐ చేర్చిందని.. అందుకే ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీ వెళ్లారని లోకేష్ ఆరోపించారు. కుటుంబం సభ్యుల పేర్లు తప్పించేందుకే జగన్ ఢిల్లీ టూర్ అంటూ మండిపడ్డారు. తమ పేర్లను చేర్చకుండా ఉండేందుకే జగన్.. ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి హస్తిన వెళ్లారని లోకేష్ అన్నారు. బాబాయ్ మర్డర్ జగనాసుర రక్త చరిత్రగా పేర్కొన్న లోకేష్.. జగన్ శాశ్వతంగా ఇడుపులపాయ ప్యాలెస్కే పరిమతం అవుతారన్నారు.
జగన్ నేతృత్వంలో అన్నింటి మాదిరిగానే కో-ఆపరేటివ్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని లోకేష్ విమర్శించారు. బుచ్చిరెడ్డిపాలెం మెయిన్ రోడ్డులో వవ్వేరు కో-ఆపరేటివ్ సొసైటీకి చెందిన రైతులు లోకేష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన కో-ఆపరేటివ్ సొసైటీలను అధికార పార్టీ నాయకులు అక్రమాలకు అడ్డాగా మార్చుకోవడం దారుణమని లోకేష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సొసైటీలను దోచుకున్న వైసీపీ దొంగలపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. సొమ్ము రికవరీ చేసి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
యువగళం గాలితో ఫ్యాన్ మాడిపోతోందని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో భాగంగా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం బహిరంగ సభలో ఆయన వైసీపీపై విరుచుకుపడ్డారు. విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ధరలు పెరిగాయని.. పండుగ కానుకలు కట్ చేశారని భగ్గుమన్నారు. జగన్ బీసీలను చిన్నచూపు చూస్తున్నారని.. అనేకమంది దళితుల్ని ఈ ప్రభుత్వం చంపేసిందని ఆరోపించారు. ఓ సీఐ ఆత్మహత్య చేసుకుంటే పోలీసు సంఘం నాయకులు ఆదుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలను వేధించిన పాపం వైసీపీని వదిలిపెట్టదన్నారు. విజయా డెయిరీని నిర్వీర్యం చేశారని.. జగన్ ఢిల్లీ టూర్ కేసుల కోసమేనని విమర్శించారు. శాండ్, ల్యాండ్, ఇసుక, గ్రావెల్, మట్టి మాఫియాకు కోవూరును వైసీపీ నేతలు అడ్డాగా మార్చారని ఆరోపించారు. టీచర్ పోస్టులను కూడా అమ్ముకున్నారన్నారు. వెయ్యి కోట్ల ఆస్తులున్న షుగర్ ఫ్యాక్టరీని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.