పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజ కవర్గం బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో జరిగిన ఒక ఆందోళనకర సంఘటనను ఒక సామాన్యుడు శ్యామ్ ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ దృష్టికి తెచ్చారు. సోమవారం స్కూల్ యూనిఫామ్లో ఉన్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు అని, షాకింగ్, ఎంఈవో, హెడ్ మాస్టర్ ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారని ట్వీట్ ద్వారా లోకేష్ కి ఫిర్యాదు చేశారు. తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారని, వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉందని తెలిపారు. ఎంఈవో, హెడ్ మాస్టర్ బాధ్యతారాహిత్య ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయని విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి, స్కూల్ సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్ట విరుద్ధమని ట్వీట్ లో సామాన్యుడు శ్యామ్ పేర్కొన్నారు. ఈ సంఘటనను వెంటనే విచారణ జరిపి బాధ్యులైన ఎంఈవో, హెడ్ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థుల భద్రతతో రాజీ పడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించలేమని, సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సామాన్యుడు శ్యామ్ చేసిన ట్వీట్ పై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఇది చాలా దారుణం, నేరం కూడా..! దీనిపై అర్జెంటుగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నానని తెలిపారు. గాయపడిన పిల్లలు, తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు,అధికారులకు హెచ్చరిక కావాలన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని అన్నారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి నారా లోకేష్ రీ ట్వీట్లో స్పష్టం చేశారు.