Lokesh Yuvagalam: యువగళం పాదయాత్ర @ 146వ రోజు
వైసీపీ పాలనలో ఏపీ చరిత్రలో లేనంతగా మహిళలపై దాడులు పెరిగాయని లోకేష్ ఆరోపించారు.;
జగన్ సర్కారుపై టీడీపీ యువనేత నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో ఏపీ చరిత్రలో లేనంతగా మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు.నెల్లూరులో మహాశక్తితో పేరుతో ముఖాముఖి నిర్వహించిన లోకేష్ మహిళల గోడు విని కంటతడి పెట్టారు.2024 ఎన్నికల ఫలితాల్లో టీడీపీ లీడింగ్లో ఉందన్న వార్తలతోనే రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు ఆగిపోతాయన్నారు. అధికారంలోకి వచ్చాక తన తల్లికి జరిగిన అవమానం మరో చెల్లికి జరగనీయనని భరోసా ఇచ్చారు. మహిళలను అవమానించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ మహిళలకేం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు.145 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకున్నాకే మహాశక్తి కార్యక్రమాన్ని మహానాడు సాక్షిగా చంద్రబాబు ప్రకటించారని లోకేష్ తెలిపారు.
ఇక ఇవాళ 146వ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం 4 గంటలకు నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అనిల్ గార్డెన్స్ విడిది కేంద్రం నుండి లోకేస్ పాదయాత్ర ప్రారంభం కానుంది. 38వ వార్డులోని కేవీఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ఎంటర్ కానుంది. ఈ సందర్భంగా వీఆర్సీ జంక్షన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు.ఆ తర్వాత పాదయాత్రలో భాగంగా కనక మహాలక్ష్మి సెంటర్లో స్వర్ణకారులు, ఆత్మకూరు బస్టాండ్ వద్ద మీ సేవా, కార్మికులతో లోకేష్ సమావేశం అవుతారు. అనంతరం రాత్రి 10.10గం.లకు సాలుచింతల వద్ద కోవూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. ఇక రాత్రి 10.35గం.లకు సాలుచింతల విడిది కేంద్రంలో బస చేస్తారు.