Vangalapudi Anitha :విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వంగలపూడి అనిత
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల సంఖ్య 20 లక్షల వరకు ఉండవచ్చని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన జగన్మాతను ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియా పాయింట్లో మాట్లాడుతూ సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శన భాగ్యం కలిగించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా దాదాపు 4500 మంది పోలీస్ సిబ్బంది భక్తుల భద్రత కోసం పనిచేస్తున్నారన్నారు. దేవాలయ కార్య నిర్వహణ అధికారి వీకే శీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలు అందజేశారు.