PAWAN: ఎన్నికలొస్తే చాలు జగన్‌కు గాయం అవుతుంది

పవన్‌కల్యాణ్‌ ఘాటు విమర్శలు... ఎన్నికలు రాగానే ఎవరో ఒకరు చనిపోతారని వ్యాఖ్య

Update: 2024-04-15 04:30 GMT

జగన్‌కు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైసీపీ నాయకులు హడావుడి చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమర్‌నాథ్‌ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైసీపీ కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోలు పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే దాడుల ఘటలు జరుగుతాయా అని తెనాలి సభలో ధ్వజమెత్తారు.. తెనాలి వారాహి విజయభేరీ బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జగన్‌ పై విరుచుకుపడ్డారు. ఎన్నికలు రాగానే వైఎస్‌ జగన్‌కు ఏదోలా గాయమవుతుందని ఎవరో ఒకరు చనిపోతారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దుయ్యబట్టారు. మాజీమంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపేస్తే గుండెపోటు అని చెప్పారన్నారు. షర్మిల, సునీత, వైఎస్‌ న్యాయం చేయమని కోరితే వారిని జగన్‌ కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే కూటమిగా వచ్చినట్లు వివరించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి సీపీఎస్‌పై అసెంబ్లీలో చర్చ పెడతామని పవన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల నిధి డబ్బులు 450 కోట్లను జగన్‌ దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక దొరకకుండా చేసి 21 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు 34 నుంచి 24 శాతానికి తగ్గించి వారిని అధికారానికి దూరం చేశారని విమర్శించారు. ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేసి 4,163 కోట్లు మళ్లించారని ధ్వజమెత్తారు


Tags:    

Similar News