TTD: తప్పు చేసి ఉంటే నాశనం అయిపోతాం

తిరుమలలో అఖిలాండం వద్ద టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రమాణం.. పోలీసు కేసు నమోదు;

Update: 2024-09-24 03:15 GMT

తిరుమల లడ్డూ వివాదం ఏపీలో రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమలలో ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారు. తిరుమలలో అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డి ప్రమాణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కల్తీ నెయ్యి వివాదం పై అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తున్న సమయంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. తాను తప్పు చేసి వుంటే తన కుటుంబం సర్వనాశమవుతుందంటూ కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తున్న సమయంలో కరుణాకర్ రెడ్డిని పోలీసులు పక్కకు లాగేశారు.

ఏమని ప్రమాణం చేశారంటే...

‘‘నేను గాని అపరాధం చేసి ఉంటే నాతో పాటు నా కుటుంబం కూడా సర్వ నాశనం అయిపోవాలి. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు" అని చెబుతూ... గోవిందా.. గోవిందా అని ఆయన ప్రమాణం చేశారు. శరణాగతి తండ్రీ... గత కొన్ని రోజులుగా నా మనసు కలత చెందుతోంది... కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డూ వ్యవహారం కళంకితమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధమని, అపచారమని పేర్కొన్నారు. కాగా ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణిలో భూమన కరుణాకర్ రెడ్డి స్నానం చేశారు. అఖిలాండం వద్ద కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు. ప్రమాణం అనంతరం భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు తిరుపతి తరలించారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఆయన వాహనంలోనే తిరుపతికి పంపించారు. శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామివారికి మొక్కారు. అంతకు ముందు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని కరుణాకర్ రెడ్డితో పోలీసులు సంతకం తీసుకున్నారు.

కేసు నమోదు

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల అఖిలాండం వద్ద ప్రమాణం చేస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో భూమనపై కేసు నమోదు చేశారు. తిరుమల చేరుకునే ముందు తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు భూమనకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను భూమన భేఖాతరు చేశారు. దీంతో భూమనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News