Tirupati Floods: తిరుపతి రాయల చెరువుకు గండి.. అధికారులు అప్రమత్తం..
Tirupati Floods: రాయల చెరువుకు గండి పడింది. ఏ క్షణమైనా కట్ట తెగే ప్రమాదం ఉందని తెలియడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
Tirupati Floods: తిరుపతి రాయల చెరువుకు గండి పడింది. ఏ క్షణమైనా కట్ట తెగే ప్రమాదం ఉందని తెలియడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గండి పడిన ప్రదేశానికి 150 మంది NDRF బృందాలను దింపారు. చెరువు దిగువన ఉన్న వారిని రక్షించేందుకు బోట్లు, లైఫ్ జాకెట్లతో సిద్ధమయ్యాయి.
మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కోరడంతో ఎయిర్ఫోర్స్ కూడా రంగంలోకి దిగుతోంది. మరికాసేపట్లో ఎయిర్ఫోర్స్ సిబ్బంది రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకోబోతున్నారు. కర్నాటక యళహంక నుంచి ప్రత్యేక హెలికాప్టర్ రాబోతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా హెలికాప్టర్ను అందుబాటులో ఉంచుతున్నారు.
తిరుపతి రాయలచెరువుకు గండి పడడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో కాలం గడుపుతున్నారు. వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండటంతో చెరువు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఏ క్షణం వరద ముంపు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొన్ని గ్రామాలకు జలదిగ్భందమయ్యాయి. ఈ గ్రామాల ప్రజలను తరలిస్తున్నారు.
మరోవైపు చిత్తూరు జిల్లా యంత్రాంగం రాత్రంతా రాయలచెరువు దగ్గరే ఉంది. కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ వెంకట అప్పలనాయుడు చెరువు మొరం పనులను పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు హెలికాఫ్టర్లను అందుబాటులో ఉంచామని, చెరువు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. మరోవైపు... తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయంలో 2 వేల కుటుంబాలకు అనుకూలంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.