ఏపీ కాంగ్రెస్ (AP Congress) చీఫ్ వైఎస్ షర్మిల (Sharmila) వచ్చే ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారట. కడప నుంచి పోటీ చేయాలని ఆమెకు పార్టీ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. సీఎం జగన్ ను ఇరకాటంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఈ ఆలోచన చేసినట్లు సమాచారం. జగన్ ను ఆయన సొంత ఇలాఖాలోనే దెబ్బ కొట్టాలని, అందుకు షర్మిలను పోటీలో నిలబెట్టడమే మార్గమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారట.
దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలూ ఈసారి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈనెల 25న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని సమాచారం.
కాగా, కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు షర్మిల ఎంపీగా పోటీ చేయాలంటూ హైకమాండ్ సూచిస్తుండడటంతో బరిలోకి దిగుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.