SHARMILA:"వైసీపీకి, వైఎస్సార్కు ఏం సంబంధం"
వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు;
మహానేత వైఎస్సార్ పేరు పెట్టినంత మాత్రానా ఆయన ఏమైనా వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా ప్రశ్నించారు. వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడని కీర్తించారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై కోపాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల మీద చూపిస్తుందని ఆరోపించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర అని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఈ దేశానికి దిశా నిర్దేశం YSR అని పేర్కొన్నారు. ప్రజాక్షేమమే పరమావధిగా చివరి దాకా పరితపించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. ఇంతటి ప్రజాభిమానం కలిగిన గొప్పనాయకుడిని నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా.. అని షర్మిలా మండిపడ్డారు.ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. నందిగామ గాంధీ సెంటర్లో మహానేత YSR విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. వైౌసీపీ మీద కోపాన్ని వైఎస్సార్ విగ్రహాల మీద చూపించి అభిమానులను భాదించొద్దని షర్మిల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.