CM Jagan: ఏపీలో స్మార్ట్‌ మీటర్ల బాదుడు

వినియోగదారులపై దాదాపు 30వేల రూపాయలు అదనపు భారం పడుతుంది;

Update: 2023-08-12 06:16 GMT

ఏపీలో స్మార్ట్‌ మీటర్ల బాదుడు మామూలుగా లేదు.ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో ధరలు భారీగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి.ఒక్కో స్మార్ట్‌ మీటరుకు కేంద్రం నిర్ణయించిన ధర ఆరువేలు. అయితే దేశమంతా ఇతర రాష్ట్రాలు దాదాపు ఇదే ధరను ఖరారు చేశాయి. అయితే ఏపీలో జగన్‌ సర్కారు మాత్రం భారీగా వసూలు చేస్తుంది. ఇతర రాష్ట్రాలకు, ఏపీకు స్మార్ట్‌ మీటరు ధరల్లో భారీ వ్యత్యాసం ఉంది.ఒక్కో మీటరుకు దాదాపు 36 వేల700 వ్యయమవుతుందని విద్యుత్‌ రంగ నిపుణులు అంటున్నారు.వినియోగదారులపై దాదాపు 30వేల రూపాయలు అదనపు భారం పడుతుంది.రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు 17వేల కోట్లతో కొనుగోలు చేస్తున్నస్మార్ట్‌ మీటర్ల వ్యవహారం వినియోగదారులపై భారం వేసేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

స్మార్ట్‌ మీటర్ల కొనుగోళ్లన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని చెబుతున్న డిస్కమ్‌లు.. ఆ వివరాలను మాత్రం బయటపెట్టడం లేదు.వ్యవసాయ, గృహ విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల వ్యవహారంపై పలువురు సమాచార హక్కు చట్టం కింద డిస్కమ్‌లకు దరఖాస్తులు చేసుకున్నా సమాధానం ఇవ్వడం లేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆర్‌టీఐ కింద దరఖాస్తులు చేయగా... స్పందించిన ఏపీఈపీడీసీఎల్‌ బిడ్లు దాఖలు చేసిన సంస్థలు,కోట్‌ చేసిన ధరలను మాత్రమే బయటపెట్టింది.ఒక్కో మీటరుకు.. అదానీ, బీఎస్‌ఆర్‌ కన్సార్షియం 24వేల334.55కుకోట్‌ చేసినట్టు తెలిపింది. దీంతో రానున్న కాలంలో మీటర్ల కొనుగోలు భారమంతా రాష్ట్ర ప్రజలపైనే ట్రూ అప్‌’చార్జీల పేరిట పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇక కేంద్రం నిర్ధారించిన ధరలో 15 శాతం రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ కింద రాష్ట్రాలకు తొమ్మిది వందల చొప్పున మంజూరు చేస్తుంది.స్మార్ట్‌ మీటరు అంటే.. మీటరు, మీటరు బాక్సు,బ్యాక్‌ ఎండ్‌ ఐటీ ఇన్‌ఫ్రా, ఇతర అనుబంధ పనులన్నింటితో ఐదేళ్ల పాటు సర్వీసు ఇవ్వాలని గైడ్‌ లైన్స్‌లో తెలిపింది. అయితే ఏపీ డిస్కమ్‌లు వీటిన్నింటినీ విడివిడిగా చూపింది. కాంట్రాక్టు సంస్థకు ఒక్కో మీటరుకు 23వేల649 చొప్పున 93 నెలల పాటు వాయిదా విధానంలో చెల్లించేలా ఈపీడీసీఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.వినియోగదారుడి నుంచి మీటరుకు 18 వందల చొప్పున, స్మార్ట్‌ మీటరు సర్వీసును జీఎస్‌టీతో కలుపుకొని 194 రూపాయల చొప్పున చెల్లించేలా అంగీకరించాయి. బ్యాక్‌ ఎండ్‌ ఐటీ సర్వీసుల కోసం ప్రతి మీటరుకూ మరో 11వేల౦౭౦ చొప్పున కాంట్రాక్టు సంస్థకు చెల్లించేందుకు డిస్కమ్‌లు అంగీకరించాయి. దీంతో ఒక్కో మీటరు ధర రూ.36,700కు చేరింది. కేంద్రం నిర్ధారించిన ధర కంటే ఆరు రెట్లు అధికంగా రాష్ట్ర డిస్కమ్‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ డిస్కమ్‌లు ఒక్కో స్మార్ట్‌ మీటరును .3వేల634కే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్‌ డిస్కమ్‌లు 7వేల943కు, ఛత్తీస్‌గఢ్‌ 9వేల720 చొప్పున మీటర్ల కొనుగోలు ధరను ఖరారు చేశాయి. కానీ ఏపీ డిస్కమ్‌లు ఒక్కో మీటరును ఏకంగా .36వేల700 చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.దీని కోసం దాదాపు 17వేల కోట్లు వ్యయం చేసేందుకు సిద్ధమయ్యాయి.

ఇక వ్యవసాయ విద్యుత్‌ను రైతులకు ఉచితంగా ప్రభుత్వం, ముందస్తుగా డిస్కమ్‌లకు చెల్లించాకే స్మార్ట్‌ మీటర్ల కొనుగోలుకు టెండర్లను పిలవాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది. అయితే నిధులు విడుదల కాకుండానే డిస్కమ్‌లు వ్యవసాయ విద్యుత్‌ మీటర్ల కోసం టెండర్లను పిలవడం.. ఖరారు చేయడం చకచకా జరిగిపోయాయి.ఇక ప్రతి నెలా ఇంటింటికీ వెళ్లి మీటర్ల రీడింగ్‌ను వ్యక్తిగతంగా నమోదు చేయడం వ్యయంతో ఖర్చుతో కూడిందని డిస్కమ్‌లు చెబుతున్నాయి. ప్రస్తుత మీటరు రీడింగ్‌ విధానం మేరకు డిస్కమ్‌లు ఒక్కోదానికి 5 రూపాయల 30 పైసలు చొప్పున చెల్లిస్తున్నాయి. అయితే స్మార్ట్‌ మీటరు విధానంలో ఒక్కో మీటరుకు 245 రూపాయలు చొప్పున చెల్లించేందుకు సిద్ధమయ్యాయి.

ప్రస్తుతం ఉన్న విధానంలో చౌకగా ఉంటే ఖర్చుతో కూడుకున్న స్మార్ట్‌ మీటరు రీడింగ్‌ విధానం ఎందుకని విద్యుత్‌ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. డిస్కమ్‌లపై ఇప్పటికే రూ. 78వేల కోట్ల రుణభారం ఉంది. ఇప్పుడు అదనంగా మరో .17వేల కోట్ల భారం పడితే సంస్థల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ విద్యుత్‌ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంటే ఆ రంగానికి స్మార్ట్‌ మీటర్లు ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News