TDP : నేటి నుంచి కృష్ణా జిల్లాలో చంద్రబాబు మూడురోజుల టూర్
మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో భారీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు;
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాల్టి నుంచి మూడ్రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో భారీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇవాళ టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమవుతుంది. విజయవాడలోని రాణిగారితోటకు చేరుకుని.. అక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మూడు స్థంబాల సెంటర్కు చేరుకుంటారు. పోరంకి నుంచి మంటాడ, గుడూరు బైపాస్ మీదుగా రోడ్షో ఉంటుంది. అనంతరం రామానాయుడు పేటలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడనుంచి హిందూ కాలేజీకి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. ఇవాళ నిమ్మకూరుకు చేరుకుని అక్కడే బస చేస్తారు.
రేపు 13వ తేదీ... నిమ్మకూరులో నిర్వహించే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం రోడ్ షో ప్రారంభమవుతుంది. బస్టాండ్ సెంటర్, నెహ్రూ చౌక్, గుడివాడ బైపాస్ మీదుగా చంద్రబాబు రోడ్ షో కొనసాగుతుంది. గుడివాడలో చంద్రబాబు పాదయాత్ర చేస్తారు. అనంతరం వీకేఆర్ కాలేజీ గ్రౌండ్స్లో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇదే కాలేజీలోనే రేపు రాత్రి బస చేస్తారు. ఇక 14వ తేదీన.. నూజివీడులో జరిగే సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. చంద్రబాబు మరోసారి ప్రజల మధ్యకు వస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
ఇప్పటికే గుడివాడలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడలో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గుడివాడలో కొడాలి నానిని ఓడించి తీరుతామంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. రెండ్రోజుల పాటు గుడివాడలోనే ఉండి...పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గుడివాడలో టీడీపీ జెండా ఎగరాలేలా వ్యూహాలు రచించనున్నారు. గుడివాడలో గెలుపే ధ్యేయంగా పార్టీ నేతలు అంతా కలిసి పనిచేయాలని సూచించనున్నారు.