వ్యవసాయం పట్ల వైకాపా సర్కారు నిర్లక్ష్య వైఖరితో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో తులిమెల్లి బసవ పున్నయ్య.. పంట దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకి పాల్పడటం తీవ్రంగా కలచివేసిందన్నారు. వారి కుటుంబసభ్యులకి పార్టీ నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు. బసవపున్నయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వకపోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. అన్నదాతలు ఓపిక పట్టాలని... మూడు నెలల్లో రైతుబంధువైన తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వస్తుందని... రైతులు అధైర్యపడద్దని లోకేశ్ భరోసా ఇచ్చారు.
మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర రేపటి శనివారం నుంచి పున:ప్రారంభంకానుంది. తుఫాన్ నేపథ్యంలో ఈనెల 4 నుంచి పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. పార్టీ నేతలు, క్యాడర్ తుఫాన్ సహాయక చర్యల్లో నిమగ్నం కావాల్సిన దృష్ట్యా పాదయాత్రకు విరామం ఇచ్చారు. తిరిగి రేపటి నుంచి మళ్లీ యువగళం పాదయాత్ర మొదలుకానుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర ఆపిన చోట నుంచి రేపు ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈనెల 11న తుని రూరల్ పరిధిలోని తేటగుంట హైవేపై 3వేల కిలోమీటర్ల పాదయాత్రను లోకేష్ పూర్తి చేయనున్నారు. అందుకు గుర్తుగా అక్కడే పైలాన్ ఆవిష్కరణ జరుగనుంది. యువనేత లోకేస్ ఇప్పటివరకు 216 రోజుల్లో మొత్తం దూరం 2,974 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.