అనంతపురం జిల్లా బడన్నపల్లిలో యువతి స్నేహలత హత్య ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఇధ్దరు యువకులు తమ కూతురును వేధిస్తున్నారని.. స్నేహలత తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. యువతి తల్లిదండ్రుల ఆవేదన చూస్తుంటే కన్నీరు ఆగడం లేదని చెప్పారు. జగన్ రెడ్డి నిర్లక్ష్యం మహిళల పాలిట శాపంగా మారిందని లోకేశ్ ధ్వజమెత్తారు. వైసీపీ సర్కారు మొద్దు నిద్ర వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు. స్నేహలతను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్నేహలత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు.