MAHANADU: మహానాడులో తొలి రోజు వీటిపైనే చర్చ

సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ మౌలిక సిద్ధాంతాలపై శ్రేణులకు దిశానిర్దేశం;

Update: 2025-05-27 03:00 GMT

తొలిరోజు పార్టీ ప్రతినిధుల సభ జరగనుంది. సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ మౌలిక సిద్ధాంతాలపై శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ రూపొందించిన ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ జరగనుంది. రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నివాళి, 6 సూత్రాల్లోని వివిధ అంశాలు, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై విస్తృతంగా చర్చించి.. ఆమోదించనున్నారు. తొలి రెండు రోజులు 25 వేల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. 450 మంది కూర్చునేలా సభావేదిక నిర్మించారు

ప్రభుత్వ నిర్ణయాలపై ప్రత్యేకంగా చర్చ

రాయలసీమ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై మహానాడులో నేతలు ప్రత్యేకంగా చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై రూపొందించిన 14 తీర్మానాలు, నాలుగు ఉమ్మడి తీర్మానాల్ని చర్చించి ఆమోదించనున్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ కట్టడికి గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తి వరకూ వివిధ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంపై చర్చిస్తారు. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, కర్నూలులో ఓర్వకల్లు హబ్, అనంతపురం జిల్లాలో కియా, పవన, సౌర విద్యుత్తు ప్రాజెక్టులు, డెయిరీల అభివృద్ధి ద్వారా లక్షల యువతకు ఉపాధి కల్పనకు ప్రభుత్వం చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

లోకేశ్‌ రూపొందించిన 6 సూత్రాలకు చోటు

చంద్రబాబు ప్రసంగం తర్వాత పార్టీ మౌలిక సిద్ధాంతాలపై చర్చిస్తారు. ‘కార్యకర్తే అధినేత, యువగళం, తెలుగుజాతి- విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, పేదల సేవలో- సోషల్‌ రీఇంజినీరింగ్, అన్నదాతకు అండ’ అనే ఆరు అంశాల్ని సభ ముందుంచుతారు. సవరణలపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇస్తారు.

మహానాడుకు వరుణుడి ఆటంకం?

టీడీపీ ప్రధాన కార్యక్రమమైన మహానాడు నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ పండుగకు తుపాను ఆటంకం కలిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల పాటు జరగబోయే మహానాడు కార్యక్రమానికి భారీ వర్షాలు సవాళుగా మారాయి. మరోవైపు కరోనా కూడా మహానాడుపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపినా, ఒకవేళ కేసులు పెరిగితే దీనిని వైసీపీ తీవ్రంగా విమర్శించే అవకాశం ఉంది.

Tags:    

Similar News