TOLLYWOOD: పవన్ దెబ్బకు దిగొచ్చిన టాలీవుడ్

ముఖ్యమంత్రితో భేటీకీ టాలీవుడ్ సిద్ధం... ఈనెల 15న 30 మంది ప్రముఖుల భేటీ;

Update: 2025-06-13 06:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగనుంది. సినీ పరిశ్రమ అభివృద్ధి, తాజా పరిణామాలపై సినీ ప్రముఖులు సీఎంతో చర్చించనున్నారు. ఇదే విషయమై ఇప్పటికే సినీరంగ ప్రముఖులంతా కలిసి రావాలని సీఎం సూచించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సైతం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టాలీవుడ్ పెద్దలు సీఎం చంద్రబాబును కలవకపోవడంపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో, సినీ పరిశ్రమ అభివృద్ధి, థియేటర్ల నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు జూన్ 15న సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. దాదాపు 30 మంది సినీ పెద్దలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

పవన్ ప్రకటనతో కదలిక

తెలుగు సినీ రంగంలో ఉన్న ప్రముఖులకు ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత లేదని పవన్ కల్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. 'హరి హర వీరమల్లు' విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేస్తారనే న్యూస్ బయటకు రావడంతో, రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్స్ అంటూ పవన్ కాస్త ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రిని కలవడానికి సినీ ప్రముఖులు రెడీ అయ్యారు.

థియేటర్ల బంద్‌‌పై పవన్ సీరియస్

ఏపీ ప్రభుత్వం సీరియస్ కావడంతో ఇండస్ట్రీలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. బంద్ లేదని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. ఇండస్ట్రీలో నలుగురు అగ్ర నిర్మాతలు బంద్ వెనుక ఉన్నారంటూ మీడియాలో విస్త్రతంగా కథనాలు వచ్చాయి. పవన్ సినిమాను తొక్కేయాలని కొందరు కుట్ర చేశారని పుకార్లు వైరల్ అయ్యాయి. ఆ వెంటనే నిర్మాతలు అల్లు అరవింద్, దిల్‌రాజులు మీడియా ముందుకు వచ్చి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదని క్లారిటీ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధి, థియేటర్ల నిర్వహణ, చిత్ర పరిశ్రమలోని సమస్యలు, తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇదే విషయమై సినీ ప్రముఖులంతా కలిసి రావాలని సీఎం సూచించారని తెలుస్తోంది. దాదాపు 30 మంది సినీ పెద్దలు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.

Tags:    

Similar News