నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ముష్టెపల్లె గ్రామంలోకి వచ్చిన అడవి దుప్పులపై కుక్కలు దాడి చేశాయి. ఈ కుక్కల దాడిలో ఒకటి మరణించగా మరొకటి తీవ్రంగా గాయపడింది. మరో మూడు దుప్పులు కుక్కలు దాటినుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.
ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లోకి తరచూ వన్యప్రాణులు వస్తున్నా అటవీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. నల్లమల్ల అడవిలో వన్యప్రాణులకు కావలసిన వసతులు సమకూర్చడంలో విఫలం అవడంతోనే అడవులను వదిలి గ్రామాల బాట పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం వన్యప్రాణులు గ్రామంలోకి రావడం, కుక్కల దాడిలో మరణించడం, గాయపడటం తరచూ జరుగుతూనే ఉన్నాయని వాపోతున్నారు. ఇక నుంచైనా అడవిలో ఏర్పాటు చేసిన నీటి కుంటలకు నీరు పోసి వాటి దాహార్తిని తీరిస్తే అవి గ్రామాల్లోకి రాకుండా ఉంటాయంటున్నారు స్థానికులు.