NANDIGAM SURESH: నేడు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్
ఎల్లుండి మధ్యాహ్నం 1 గంట వరకూ విచారణ.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణ;
గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఈరోజు మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు. అయితే, టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు సహాకరించాలని తెలిపింది. ఈ దాడి వెనుక.. ఎవరు ఉన్నారనే దానిపై పోలీసుల విచారణలో తేల్చనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి (మంగళవారం) మధ్యాహ్నం 1 గంట వరకు పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు. విచారణ సందర్భంగా ఎలాంటి లాఠీ చార్జీ చేయడానికి, దూషించడం, భయ పెట్టడం లాంటివి చేయొద్దని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తమ న్యాయవాదులను కూడా విచారణకు అనుమతించాలని నందిగం సురేష్ తరఫు న్యాయవాది వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేస్తే.. దానిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని మంగళగిరి కోర్టు పేర్కొనింది. ఇదిలావుంటే.. నందిగం సురేశ్ బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలోనూ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఆఫీసు కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా.. ఈ కేసులో మరోసారి అరెస్టు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ఆ పార్టీ నేతలు అరెస్టైన విషయం తెలిసిందే. వైసీపీ నుండి గెలిచి ఆ పార్టీకే రెబెల్ అభ్యర్థిగా మారిన రఘురామ కృషం రాజు సైతం అరెస్ట్ అయ్యారు. వీరిలో కొందరికి పోలీసుల విచారణలో తాట తీశారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ మాజీకి ఎంపీకి కూడా అలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
వందల కోట్లు ఎక్కడివి..?
ఒక సాధారణ ఫొటోగ్రాఫర్ అయిన నందిగం సురేష్ గత ఐదేళ్లలో రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. అమరావతిలో రహదారులు తవ్వేసి కంకర అమ్ముకున్న, అరటితోటలు నరికేసిన, తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన సురేష్ను వైకాపా అధినేత జగన్ పరామర్శించడం దేనికి సంకేతమని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘సురేష్కు తొమ్మిది ఆడీ కార్లున్నాయి. హైదరాబాద్ శివారుల్లో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? గత ప్రభుత్వంలో ఆయన చేయని దందాలు, అకృత్యాలు లేవు. గతంలో ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగించిన బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూల్చాలని చూశారు’’ అని అనురాధ దుయ్యబట్టారు. బాలికను లైంగికంగా వేధించి ఫోక్సో కేసులో అరెస్టయిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్నూ జగన్ త్వరలో పరామర్శించనున్నారని, వరద బాధితుల కష్టాలను తెలుసుకునేందుకు మాత్రం ఆయనకు మనసురాదని మండిపడ్డారు.