భార్యకు మనోవర్తి చెల్లింపు కేసులో సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను జులై 15కు వాయిదా వేసింది. నెలకు రూ.22వేల మనోవర్తితోపాటు బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పృథ్వీ పాటించలేదని భార్య శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ ఇచ్చింది.
పృథ్వీరాజ్భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి.. విజయవాడ ఫ్యామిలీ కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. ఆమెకు నెలకు రూ.8లక్షలు మనోవర్తిగా చెల్లించాలని ఆదేశించింది. దీనిపై పృథ్వీరాజ్ హైకోర్టును ఆశ్రయించారు. నెలకు రూ.22వేలు చెల్లించడంతో పాటు అప్పటివరకు ఉన్న బకాయిలు కూడా అందజేయాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పృథ్వీరాజ్ పాటించలేదని ఆరోపిస్తూ భార్య శ్రీలక్ష్మి.. ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులో మరోసారి పిటిషన్ వేశారు.
పృథ్వీరాజ్ విషయానికి వస్తే 1984లో ఆయన శ్రీ లక్ష్మీ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు. కుమార్తె కూడా ఉన్నారు.ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు.