Tollywood : ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే..?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ చిత్రం 'డ్రాగన్'లో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ కు తెరపడింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణీ వసంత్ నటిస్తున్నట్లు నిర్మాత ఎన్వీ ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు.
తాజాగా శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన 'మదరాసి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్, హీరోయిన్ రుక్మిణీ వసంత్ గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని ధృవీకరించారు. "మదరాసి సినిమాలో రుక్మిణిని ఎంపిక చేసినప్పుడు ఆమె అప్కమింగ్ హీరోయిన్. కానీ ఈరోజు ఆమె 'కాంతార 2'లో, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో, అలాగే 'టాక్సిక్'లోనూ హీరోయిన్గా చేస్తోంది" అని తెలిపారు. ఈ ప్రకటనతో 'డ్రాగన్'లో రుక్మిణీ వసంత్ నటిస్తున్నారన్న ప్రచారం నిజమని తేలింది.
కేజీయఫ్, సలార్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, మాస్ హీరో ఎన్టీఆర్ల కలయికతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కర్ణాటకలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, త్వరలోనే హైదరాబాద్లో మరో షెడ్యూల్ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.