ప్రముఖ తమిళ దర్శకుడు జయభారతి(77) కన్నుమూశారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. 1979లో క్రౌడ్ ఫండింగ్ విధానంలో కుడిసై సినిమా తీసి గుర్తింపు పొందారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో కేవలం 9 సినిమాలకే దర్శకత్వం వహించారు. పాత్రికేయుడిగా పనిచేస్తూ ప్రముఖ దర్శకుడు బాలచందర్కు పరిచయమయ్యారు. 1976లో రూపొందిన ‘మూండ్రు మూడిచ్చి’ చిత్రంలో ఆయన్ను కథానాయకుడిగా నటించాలని బాలచందర్ కోరగా తనకు నటనలో ఆసక్తి లేదని కావాలంటే దర్శకత్వం చేస్తానంటూ సున్నితంగా తిరస్కరించారు. సినిమాకి సంబంధించిన కోర్సులు చేయకుండా, ఏ దర్శకుడి వద్ద పనిచేయకుండానే తనకున్న సినిమా పరిజ్ఞానంతో దర్శకుడిగా పరిచయం కావడం గమనార్హం. ఆ తొలి చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.