రాజమౌళి ( Rajamouli ) దంపతులు ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. దర్శకుల కేటగిరీలో రాజమౌళి, కాస్ట్యూమ్ కేటగిరీలో రమా రాజమౌళి ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఈ ఏడాది 57 దేశాల నుంచి 487 మందికి ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. ఇందులో షబానా అజ్మి, రితేశ్ సిద్వానీ, రవి వర్మన్ మరికొందరు సినీ ప్రముఖులు భారత్ నుంచి ఉన్నారు. గతేడాది రామ్చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, సెంథిల్ ఈ అకాడమీలో సభ్యత్వం సంపాదించారు.
ఇక అకాడమీ పత్రికా ప్రకటన ప్రకారం.. 2024 ఆహ్వాన జాబితాలో 44 శాతం మహిళలు, 41 శాతం ఎథ్నిక్ కమ్యూనిటీలు ఉన్నట్లు ఉన్నారు. యూఎస్ కాకుండా 56 దేశాలకు చెందిన ప్రముఖులు ఆహ్వానం అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా అకాడమీ సీఈఓ బిల్ క్రామిర్, అధ్యక్షుడు జానెత్ యాంగ్ హర్షం వ్యక్తం చేశారు. "ఈ సంవత్సరం అకాడమీకి కొత్త సభ్యులను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ప్రపంచదేశాలకు చెందిన అసాధారణ ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులు మా చిత్రనిర్మాణ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు. అలాంటి వారిని ఆహ్వానించడం ఆనందంగా ఉంది" అని వారు పేర్కొన్నారు. ఇక బహుళ శాఖలలో ఆహ్వానం అందిన వ్యక్తులు సభ్యత్వం కోసం ఏదో ఒక శాఖను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
.