హైదరాబాద్లో దారుణం.. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు
హైదరాబాద్లో నివాసం ఉండే ప్రభుత్వ ఉద్యోగులైన దంపతులు.. గురువారం ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు..;
ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం కాకపోయినా... కుటుంబ కలహాలకు చావునే పరిష్కారంగా అనుకుంటున్నారు కొందరు భార్యాభర్తలు. తమదారిన తాము సూసైడ్ చేసుకుని పిల్లల్ని అనాథలుగా చేస్తున్నారు. హైదరాబాద్ చిలకలగూడ పీఎస్ పరిధిలో అలాంటి ఘటనే జరిగింది. అంబర్ నగర్లో నివాసం ఉండే ప్రభుత్వ ఉద్యోగులైన వెంకటేశ్, భార్గవి దంపతులు.. గురువారం ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు చేసిన పనితో.. ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు. దంపతుల స్వస్థలం మెదక్గా పోలీసులు గుర్తించారు.
భార్యభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. వెంకటేశ్ విద్యుత్ శాఖలో పనిచేస్తుండగా.. భార్గవి పోస్టాఫీస్లో పనిచేస్తున్నారు. వారు చేస్తున్న ఉద్యోగాల విషయంలో ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నట్టు బంధువులు తెలిపారు. బుధవారం తన కూతురుఫోన్ చేసిన తనను క్షమించమని అడిగినట్టు... భార్గవి తండ్రి తెలిపారు. చనిపోవడానికి ఆర్థిక సమస్యలేమైనా ఉన్నాయా.. .లేక అనారోగ్య సమస్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి వరకు పచ్చగా కనిపించిన ఓ కుటుంబంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాలనుపోస్ట్మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్ తండ్రికి రెండో వివాహం జరగడంతో ఆస్తి విషయంలో మనస్పర్థలు తలెత్తినట్టు స్థానికులు చెబుతున్నారు.