ARREST: కిరణ్ చేబ్రోలు అరెస్ట్.. హైడ్రామా!

వైఎస్‌ భారతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్‌... కిరణ్‌పై దాడికి యత్నించిన మాజీ ఎంపీ మాధవ్;

Update: 2025-04-11 03:30 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నా ఆయనను సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడలో పట్టుకున్నారు. అనంతరం గుంటూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే ఆయనని తరలిస్తున్న నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. కిరణ్‌పై దాడికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు గోరంట్ల మాధవ్‌ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కిరణ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు కిరణ్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

కఠిన చర్యలు

విషయం పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ప్రభుత్వం దీనిపై తీవ్రమైన చర్యలకు పూనుకుంది. మహిళలు, చిన్నారులపై సైతం నీచమైన వ్యాఖ్యలు చేయడాన్ని సహించేది లేదన్న నిశ్చయంతో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఏ పార్టీ వారైనా మహిళలు, చిన్నారులపై ట్రోల్స్ చేయడం, అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తే అస్సలు ఊరుకోనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పెద్దలు పోలీసులకిచ్చిన సూచనల మేరకు మంగళగిరి పోలీసులు, విజయవాడ – ఇబ్రహీంపట్నం రోడ్డులో కిరణ్‌ను అరెస్టు చేశారు.

పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ

ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే వ్యక్తి తమతో కొనసాగలేడు అనే ఉద్దేశంతో, వెంటనే చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ తరహా వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని, మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో స్వేచ్ఛ పేరుతో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తుచేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ఇలాంటి సంస్కృతికి చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ అనుబంధ విభాగమైన ఐటీడీపీలో కిరణ్ ఇప్పటివరకు యాక్టివ్ కార్యకర్తగా ఉన్నారు.

Tags:    

Similar News