ఐస్క్రీమ్లో మనిషి వేలు, హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుక వచ్చిన ఘటనలు మరువకముందే మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గుజరాత్ అహ్మదాబాద్లోని ప్రసిద్ధ దేవి దోస రెస్టారెంట్లో సాంబార్ గిన్నెలో చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైంది. దీంతో కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెస్టారెంట్ను సీజ్ చేసి మేనేజ్మెంట్కు నోటీసులిచ్చారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇంటర్నెట్లో ఓ రేంజ్ లో దుమారం చెలరేగింది. ఈ సంఘటన ఖచ్చితంగా దిగ్భ్రాంతికరమైనది. అంతేకాదు ప్రస్తుతం వరసగా జరుగుతున్న సంఘటనలతో ఆహార భద్రత ఏ విధంగా ఉన్నదనే ప్రశ్న తలెత్తేలా చేస్తుంది.
జూన్ 20న తన భార్యతో కలిసి డిన్నర్ కోసం దేవి దోస ప్యాలెస్కి వెళ్లినట్లు అవినాష్ చెప్పాడు. ఆర్డర్ చేసిన ఫుడ్ ను వడ్డించే ముందు సాంబార్ , చట్నీ వడ్డించారని అతను చెప్పాడు. అయితే సాంబారు తింటూ ఉండగా గిన్నెలో చనిపోయిన ఎలుకను చూసి షాక్ అయ్యానని వెల్లడించాడు. దీంతో కోపోద్రిక్తుడైన అవినాష్ వెంటనే తన మొబైల్ లో సాంబార్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.