CRIME: మహిళలు, చిన్నారులపై ఆగని ఆకృత్యాలు
తిరుపతిలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం... వీడిన కడిపులంక హత్యాచార కేసు మిస్టరీ;
తెలుగు రాష్ట్రాల్లో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. కఠిన శిక్షలు అమలు అవుతున్నా మహిళలు, చిన్నారులపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. తిరుపతి జిల్లా వలమాడపేట మండల పరిధిలోని ఏఎంపురంలో దారుణం చోటుచేసుకుంది. మూడున్నరేళ్ల బాలికకు చాక్లెట్ల ఆశ చూపి సుశాంత్ అనే యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారిపై అత్యాచారయత్నానికి యత్నించగా.. చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో తాను ఎక్కడ దొరికిపోతానోనని భయపడిన సుశాంత్ క్షణికావేశంలో బాలికను చంపేశాడు. అనంతరం మృతదేహం ఎవరికీ దొరకకుండా పాతిపెట్టాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు సుశాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వీడిన కడియపులంక హత్యాచార మిస్టరీ
తూర్పుగోదావరి జిల్లా కడియపులంక బుర్రిలంక ప్రాంతానికి చెందిన రౌతు కస్తూరి(44) హత్యాచార కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 15న కూలి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కూలి పనికి వెళ్లి తిరిగి వస్తుండగా పలు దృశ్యాలు సీసీ టీవీ పుటేజీల్లో లభించాయి. పోలీసులు ఆ ప్రాంతంలో పని చేసే నలుగురు యువకులను పట్టుకుని తమదైన శైలిలో విచారిస్తే అసల విషయం చెప్పారు. ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు రాజమహేంద్రవరం సౌత్జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు.
75 ఏళ్ల బామ్మపై అత్యాచారం చేసిన మనవడు
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో అమానుషం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన 75 ఏళ్ల నానమ్మపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సభ్యసమాజాన్ని, సంబంధాలను సిగ్గుపడేలా చేసింది. అదే సమయంలో ఈ ఘటన ఆ కుటుంబంతోపాటు ఆ ప్రాంతంలోనూ ఆగ్రహావేశాలు రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.