శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు గురువారం రూ.కోటి విరాళంగా అందింది. రాష్ట్ర మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ తో కలిసి దాత సికెపిసి ప్రాపర్టీస్ ఎండి చిరాగ్ పురుషోత్తం ఈ మేరకు విరాళం డిడిని టిటిడి చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడుకు అందజేశారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎందరో పేద రోగులకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తున్న టిటిడి ఔదార్యాన్ని దాత కొనియాడారు. గుండె, మూత్రపిండాలు, మెదడు మొదలైన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న అనేకమంది పేదలకు ఉచిత సేవలందిస్తున్న ఇలాంటి గొప్ప ట్రస్ట్ కు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రూ. కోటి విరాళం అందజేసినందుకు దాతను టీటీడీ చైర్మన్ అభినందించారు.