బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్యలోని రామ మందిరాన్ని మరోసారి సందర్శించారు. ముంబై నుంచి అయోధ్యకు వెళ్లిన ఆయన ఫిబ్రవరి 9న బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భారీ భద్రత మధ్య బిగ్బీ ఆలయం నుంచి బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమితాబ్ బచ్చన్ అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడం ఇది రెండో సారి. జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు కూడా అమితాబ్ హాజరయ్యారు. ప్రధాని మోదీ చేతులమీదుగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు బిగ్బీతోపాటు సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హాజరై శ్రీరాముడిని దర్శించుకున్నారు. అప్పుడు రాముడి దర్శనానికి సంబంధించిన ఫొటోలను కూడా బిగ్బీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘రామచంద్రకీ జై’అంటూ దివ్యమైన రూపంలో గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకుంటున్న ఫొటో, ఆలయం చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు.
ఇక ఇటీవలే కర్ణాటకలో రాయచూర్ జిల్లాలోగల కృష్ణా నదిలో వెయ్యేళ్ల నాటి విష్ణు విగ్రహం బయటపడింది. ఇది అయోధ్య బాల రాముడి విగ్రహాన్ని పోలి ఉండటం సంచలనంగా మారింది. దేవసుగూరు గ్రామ సమీపంలో నదిపై వంతెన నిర్మాణ పనులు చేపడుతుండగా ఈ విగ్రహం బయటపడింది.