TTD : టిటిడిపై తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు

Update: 2025-09-17 07:59 GMT

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం చైర్మన్ అధ్యక్షతన టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి చైర్మన్ మీడియాకు వివరించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు:

– తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు జరుగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నాం.

– ఈ నెల 23వ తేదీ సాయంత్రం 7 గంట‌లకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 05.43 గం.ల- 06.15 గం.ల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణము నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది.

– బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నాం. అదే రోజు రాత్రి 9 గంట‌లకు శ్రీ‌వారు పెద్దశేష వాహనంలో ముఖ్యమంత్రివర్యులు పాల్గొంటారు.సెప్టెంబ‌రు 25వ తేదీన సీఎం పిఏసి- 5 శ్రీ వెంక‌టాద్రి నిల‌యాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా 2026వ సంవ‌త్స‌రానికి సంబంధించిన క్యాలెండ‌ర్లు, డైరీల‌ను ఆవిష్కరిస్తారు.

– ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఇస్రో సహకారంతో శాట్ లైట్ ఆధారంగా భక్తుల సంఖ్యను గణన చేసేందుకు చర్యలు చేపట్టాం.

– బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా పుష్పాలంక‌ర‌ణ‌లు, వివిధ దేవ‌తామూర్తుల ఆర్చిలు, ఎల్ఇడి తోర‌ణాలు, అన్ని ప్ర‌ధాన కూడ‌ళ్ళ‌లో పెద్ద ఎల్ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నాం.

– బ్రహ్మోత్సల సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు దివ్యాంగులు, వ‌యోవృద్ధులు, ఎన్.ఆర్.ఐ, చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశాం. బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే ప‌రిమితం చేశాం.

– ప్రతి రోజు 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నాం.

– ఈ నెల 28న గరుడ సేవ సందర్భంగా ఈ నెల 27వ తేదీ రాత్రి 9 గంట‌ల నుండి 29వ తేదీ సాయంత్రం 6 గంట‌ల వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేస్తున్నాం. అదేవిధంగా, అలిపిరి, శ్రీవారి మెట్టు న‌డ‌క దారులు 28వ తేదీన రౌండ్ ద క్లాక్ తెరిచే ఉంటాయి.

– తిరుమలలోని ర‌ద్ధీ ప్రాంతాల్లో అద‌న‌పు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.

– బ్రహ్మోత్సవాలలో చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్నాం.

– బ్ర‌హ్మోత్స‌వాల‌లో నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టాం.

– ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు స్వామివారి వాహ‌న‌సేవ‌లను వీక్షించేలా హెచ్‌డి క్యాలిటీతో నాణ్యంగా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తాం.

– గ‌రుడ‌సేవ‌నాడు 4 ల‌క్ష‌ల మ‌జ్జిగ ప్యాకెట్లు భ‌క్తుల‌కు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నాం.

– తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా ఫ‌ల పుష్ప ప్ర‌ద‌ర్శ‌న, ఫోటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేస్తున్నాం.

– అదే విధంగా, క‌ర్ణాట‌క రాష్ట్రం బెల‌గావిలోని కొలికోప్ప గ్రామంలో టీటీడీ శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో 7 ఎక‌రాల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాన్ని నిర్మించేందుకు ఆమోదించాం.

– గుంటూరు జిల్లా తుళ్ళూరు మండ‌లం అనంత‌వ‌రం గ్రామంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో రూ. 7.20 కోట్ల‌తో రాజ‌గోపురం, ముఖ మండ‌పం, శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామివారికి ఆభ‌ర‌ణాలు, అదేవిధంగా ఆల‌యంలో తాగు నీటి సౌక‌ర్యం, ఆర్చి, మ‌రుగుదొడ్లు, త‌దిత‌ర‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ద‌శ‌ల‌వారిగా చేప‌ట్టేందుకు నిర్ణయం.

– అన్న‌మ‌య్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ ప‌ట్టాభిరామ‌స్వామివారి ఆల‌య పుష్క‌రిణి, క‌ల్యాణ వేదిక మండ‌పం, రాజ‌గోపురం, ఆర్చి, క‌ల్యాణ మండ‌పం త‌దిత‌ర అభివృద్ధి ప‌నుల‌కు రూ.5.73 కోట్లు, త‌రిగొండ‌లోని శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి పుష్క‌రిణి పునః నిర్మాణానికి రూ.1.50 కోట్ల‌తో ప‌నులు చేప‌ట్టేందుకు నిర్ణ‌యం.

హైద‌రాబాద్‌కు చెందిన బ‌ద్రి వెంక‌ట‌రెడ్డి, బ‌ద్రి విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డిలు గుంటూరు జిల్లా, మంగ‌ళ‌గిరి మండ‌లం కాజా గ్రామంలో స‌ర్వే నంబ‌రు 141-2లో రూ.89.54 ల‌క్ష‌ల విలువ చేసే 0.74 సెంట్ల స్థ‌లాన్ని దాత‌లు టీటీడీకి విరాళంగా అందించారు. స‌ద‌రు భూమిని స్వీక‌రించేందుకు ఆమోదం. అదేవిధంగా, ముఖ్యమంత్రిఆదేశాల మేరకు మొదటి దశలో రాష్ట్రంలోని దళిత వాడల్లో 1000 ఆలయాలను నిర్మించేందుకు నిర్ణయం. టిటిడిపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.

Tags:    

Similar News