ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. వసంత పంచమిని పురస్కరించుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాదిగా వస్తున్నారు. మౌని అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాటతో అప్రమత్తమైన యూపీ సర్కార్, మరలా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులను రంగంలోకి దించింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు గత 20 రోజుల వ్యవధిలో దాదాపు 33 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 2.15 కోట్లమంది రాగా, ఆదివారం ఈ సంఖ్య కోటిమార్కును దాటింది. వసంత పంచమిని పురస్కరించుకుని సోమవారం 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనావేస్తున్నారు.