TTD Chairman : ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు సబబు కాదు : బీఆర్ నాయుడు
ఏఐ విధానంపై మాజీ ఈవో, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. తిరుమలలో శ్రీవారి క్యూ కాంప్లెక్సులలో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఉచితంగా గూగుల్ / టిసిఎస్ లతో పాటు ఇతర సంస్థల సహకారంతో అధునాతన ఏఐ టెక్నాలజీ ఉపయోగించి నిర్దేశించిన సమయం లోపు భక్తులకు దర్శనం కల్పించాలని టిటిడి పాలకమండలి చర్చించి నిర్ణయించిందని టిటిడి ఛైర్మన్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిర్దేశించిన సమయానికి కల్పించేందుకు, దర్శనం సమయాన్ని భక్తులకు ముందస్తుగా తెలియజేయడానికి మాత్రమే ఏఐ విధానాన్ని అమలుకు నిర్ణయించామన్నారు. భక్తులకు శ్రీవారి దర్శన సమయం ముందుగా తెలియడం ద్వారా భక్తులు ఎక్కువ సమయం కంపార్ట్మెంట్ లలో వేచియుండకుండా ఇతర ఆలయాలను సందర్శించేందుకు వీలుగా టిటిడి పాలక మండలి నిర్ణయించిందన్నారు. ఇలాంటి సమయంలో విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి, టిటిడి మాజీ ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీ పై అవగాహన లేకుండా వ్యాఖలు చేయడం బాధాకరమని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఖండించారు. ఒక సీనియర్ అధికారిగా పని చేసిన అనుభవం ఉన్న శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, ఇలాంటి మాటలు భక్తుల్లో గందరగోళం సృష్టేంచేలా ఉన్నాయన్నారు. దాతల సహాయంతో టిటిడిలో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృధా అని అనడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నామని ఛైర్మన్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ సాంకేతికతను ఉపయోగించి సేవలను సులభతరం చేస్తుంటే, అదే పద్దతిలో ఏఐ టెక్నాలజీ ద్వారా టీటీడీలో కేవలం దర్శనం సమయాన్ని భక్తులకు ముందస్తుగా తెలియజేసేందుకు, మరింత సౌకర్యవంతంగా, సులభతరం చేసేందుకు మాత్రమే ఉపయోగించేలా నిర్ణయించామన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకమని శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు..