విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భక్తుల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఒకవేళ సంప్రదాయ దుస్తులు లేకపోతే ఆలయంలోకి ప్రవేశం ఇవ్వబోమని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా, ఆలయంలో సెల్ఫోన్ వాడకంపై నిషేధం విధించారు. ఇటీవల భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించకపోవడం, అంతరాలయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వంటి ఘటనలు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా, ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే వారు ఆలయ ఆఫీసులోనే ఫోన్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. భక్తులు, ఉద్యోగులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించడం ఇకపై తప్పనిసరి కానుంది. ఆలయ సిబ్బంది తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలని.. అలాగే స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ఇకపై డ్రెస్ కోడ్ లేకపోయినా, సెల్ఫోన్ తీసుకవచ్చే వారిని ఆలయంలోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.