దేశంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ గిరిజన సంబరం నాగోబా జాతర ఈ నెల 28న ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఏటా పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి మహాపూజతో ఈ జాతర ప్రారంభంకానుంది. అప్పటి నుంచి 5 రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది 28న అమావాస్య కావడంతో ఆ రోజున అర్ధరాత్రి పూజలు చేసి.. జాతరను ప్రారంభిస్తారు. ఈ జాతరలో కీలమైన మూడోరోజు నిర్వహించే గిరిజన దర్బార్ ఈ నెల 31న జరగనుంది. జాతర ఏర్పాట్లకు సంబంధించి కేస్లాపూర్లో అధికారులు సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్, ఉట్నూరు ఐటీటీఏ పీవో, ఎస్పీ, సబ్ కలెక్టర్ తదితర అధికారులు నాగోబాను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లపై చర్చించారు.